జన్వాడలో డ్రోన్‌ ఎగురవేత..


రేవంత్‌రెడ్డిపై కేసును కొట్టివేత
` కేటీఆర్‌పై కేసు కూడా..
` ఇరువురిపై కేసులు రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్‌ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రేవంత్‌రెడ్డిని అప్పట్లో నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈక్రమంలో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని చెప్పారు. మరోవైపు సైఫాబాద్‌ పీఎస్‌లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సీఎం రేవంత్‌రెడ్డిని కించపర్చే విధంగా మాట్లాడారని.. ఎంపీ అనిల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్‌ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసును కొట్టేయాలని కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.వాదనల సందర్భంగా.. బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్‌ ఇష్టారీతిన మాట్లాడారని పీపీ చెప్పారు. సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు. మరోవైపు రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని కేటీఆర్‌ తరఫు న్యాయవాది అన్నారు. ఇరువైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది.