సంజయ్‌ తరపున నేను పిటిషన్‌ వేస్తా : కట్జూ

 న్యూ ఢిల్లీ,మార్చి 28 (జనంసాక్షి) : సంజయ్‌దత్‌ తరఫున క్ష్షమాభిక్ష పిటిషన్‌ దరఖాస్తులను మహారాష్ట్ర గవర్నర్‌, రాష్ట్రపతికి పంపిస్తానని ప్రెస్‌ కౌన్సిల్‌ఆఫ్‌ ఇండి (భారత పాత్రికేయ మండలి) చైర్మన్‌ మార్కండేయ కట్జూ పేర్కొన్నారు. తాను క్షమాభిక్ష కోరనని బాలివుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ గురువారం స్పష్టం చేసిన విషయం విదితమే. దత్‌ ప్రకటనతో తనకేమీ ఇబ్బందిలేదని, అది తాను పట్టించుకోనని కట్జూ తెలిపారు. మానవతా కారణాలపైన, ప్రజా క్షేమం అంశంపైన తాను క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేస్తానన్నారు. రాజ్యాంగంలోని సెక్షన్‌ 72 కింద రాష్ట్రపతికి, సెక్షన్‌ 166 కింద గవర్నర్‌కు క్షమాభిక్ష ప్రసాదించే అధికారులున్నట్లు ఆయన వెల్లడించారు. దత్‌తో తాను మాట్లాడలేదని, అతను కూడా తనను ఏమీ అభ్యర్థించలేదని ఆయన తెలిపారు. సంజయ్‌దత్‌ జైలు శిక్ష అనుభవించాలని మార్చి 21న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.