సిస్టర్‌ నిర్మల ఇకలేరు

2
– కేసీఆర్‌, మమత ప్రగాఢ సంతాపం

కోల్‌కతా,జూన్‌23(జనంసాక్షి):మదర్‌ థెరిసా వారసురాలు సిస్టర్‌ నిర్మల కన్నుమూశారు. మిషనరీ ఆఫ్‌ ఛారిటీస్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సిస్టర్‌ నిర్మల(81) అనారోగ్యం కారణంగా ఉదయం కన్నుమూశారు. మదర్‌ థెరిస్సా తర్వాత సిస్టర్‌ నిర్మల మిషనరీ ఆఫ్‌ ఛారిటీస్‌ బాధ్యతలను చూస్తున్నారు. ఆమె అంత్యక్రియలు బుధవారం కోల్‌కతాలో జరుగుతాయి.  నిర్మలా జోషీ 1934లో రాంచీలో జన్మించారు. సిస్టర్‌ తల్లిదండ్రులు నేపాల్‌కు చెందిన హిందూ జాతీయులు. తండ్రి బ్రిటీష్‌ ఆర్మీలో ఉద్యోగి. విద్యాభ్యాసం మొత్తం పాట్నాలోని క్రిస్టియన్‌ మిషనరీలో జరిగింది. మదర్‌ థెరిస్సా సేవాభావం నచ్చి రోమన్‌ క్యాథలిక్‌లోకి మారింది. అనంతరం మదర్‌ థెరిస్సా స్థాపించిన మిషనరీ ఆఫ్‌ ఛారిటీస్‌లో చేరి తన సేవలను కొనసాగించారు. సిస్టర్‌ సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2009లో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ తో సత్కరించింది. మదర్‌ థెరిస్సా తర్వాత 1997 నుంచి 2009 వరకు మిషనరీ ఆఫ్‌ ఛారిటీస్‌ బాధ్యతలు నిర్వహించారు. నిర్మల మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ,  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌గ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిస్వార్థ సేవలు అందించిన సిస్టర్‌ నిర్మలను కోల్పోవడం బాధాకరమన్నారు.సిస్టర్‌ నిర్మల స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  నిస్వార్థ సేవా ధృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ఛారిటీ సంస్థలను నిర్వహించిన నిర్మల స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతారు. ఆమె స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగించే శక్తిని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీకి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు.