సీరియల్స్ ప్రభావంతో..
మహిళల్లో క్రూరత్వం పెరుగుతోంది
– సీరియల్స్ పై సెన్సార్ పెట్టాలి
– పురుష కమిషన్ ఏర్పాటు చేయాలి
– నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ, మే30( జనం సాక్షి) : ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డైలీ సీరియల్ ప్రభావంతో మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే పురుష కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుందోమేనని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలపై జరుగుతున్నదాడులు, డైలీ సీరియల్ ప్రభావంపై స్పందించిన ఆమె మాట్లాడుతూ ఇలాంటి వాటిపై సమాజం పట్టించుకోవాలని, చట్టాలు గట్టిగా ఉండాలని ఆకాంక్షించారు. ఇరుగు పొరుగువారు కూడా ఏం జరుగుతుందో గమనించాలని అన్నారు. ఆత్మ, ప్రాణ, మాన రక్షణ కోసం మహిళలు పోలీసులు వచ్చే వరకు ఎదురు చూడకుండా తనను తాను రక్షించుకోవడం కోసం.. లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తిపై దాడి చేయాలని, ఖచ్చితంగా ఆయుధం తీసుకుని తిరగబడాల్సిందేనని నన్నపనేని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఆమె వివరించారు. అలాగే మహిళలు కూడా ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని భర్తలను కిరాయి గుండాలతో హతమారుస్తున్నారని నన్నపనేని అన్నారు. ఈ విధంగా మహిళలు పాల్పడ్డానికి కొన్ని చానల్స్లో వచ్చే డైలీ సీరియల్స్ ప్రభావం ఎంతో ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సీరియల్స్ చాలా దారుణంగా ఉంటున్నాయని… ఎక్కువగా మహిళలే విలన్ పాత్రలు పోషిస్తున్నారని నన్నపనేని ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులను ఎలా చంపాలో చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో భర్తను భార్య హత్య చేసిన సంఘటన, హత్యాయత్నానికి పాల్పడిన మరొక ఘటన విస్తుగొలిపాయని రాజకుమారి చెప్పారు. ఈ సందర్భంగా మహిళల బాధిత కుటుంబాలను పరామర్శిస్తామని తెలిపారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీరియల్స్ విూద సెన్సార్ పెట్టాలని, మహిళల నుంచి పురుషులకు రక్షణ కోసం పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని నన్నపనేని డిమాండ్ చేశారు.
—————————————–