సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి
చైనా ప్రధానికి ఓబామా హెచ్చరిక
వాషింగ్టన్, (జనంసాక్షి) :
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జి. జిన్పింగ్ను హెచ్చరించారు. సైబర్ చోరీల వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. చైనా సైబర్ చోరీలకు సంబంధించిన ఆధారాలను చూపెట్టినట్లు సమాచారం. కాలిఫోర్నియాలో ఇరు దేశాలకు సంబంధించిన ఆధారాలు చూపెట్టి వాటిని నివారించాలని సూచించినట్లు సమాచారం. పలు దఫాలుగా దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన చర్చల్లో సైబర్ నేరాలతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చించారు. గ్రీన్హౌస్ వాయువులు, వాతావరణ మార్పులు తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తమ దేశంలో సైబర్ చోరీలకు చైనాయే కారణమని ఓబామా గట్టిగా చెప్పారు. తమ దేశంలోని పలు సంస్థల నుంచి రూ. వందల కోట్లాది డాలర్ల విలువైన సాంకేతిక, ఆర్థిక, ఇతర సమాచారాన్ని చైనా చోరీ చేస్తోందని ఆరోపించగా, జిన్పింగ్ ఆ వాదనను తోసిపుచ్చారు. దీంతో ఓబామా తమ దేశ అధికారులు సేకరించిన పలు సాక్ష్యాలను జిన్పింగ్ ఎదుట ఉంచారు