హోం లోన్లు: ఎస్‌బీఐ శుభవార్త

దిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి గృహ రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపే తీసుకోండి. మార్చి 31 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును ఎస్‌బీఐ రద్దు చేసింది. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఎస్‌బీఐ గృహ రుణాలపై మార్చి 31 వరకు ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా రద్దు చేశాం. అంతేగాక.. ఆకర్షణీయమైన వడ్డీరేట్లు కూడా ఉన్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని కోల్పోవద్దు’ అని ట్విటర్‌లో పేర్కొంది. 

ఎస్‌బీఐలో రూ. 30లక్షల వరకు గృహ రుణాలు తీసుకునే వేతన జీవులకు రూ. 8.4శాతం వడ్డీరేటు పడుతుంది. ఇదే ఉద్యోగం చేసే మహిళలకైతే 8.35శాతం మాత్రమే. ఇక వేతన జీవులు కాకపోతే మహిళలకు 8.45శాతం, పురుషులకు 8.5శాతం వడ్డీరేటు ఉంటుంది. కాగా.. మార్చి 31 ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేసింది ఎస్‌బీఐ.

మరోవైపు ఎస్‌బీఐలో విలీనమైన ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల పాస్‌బుక్‌లు, చెక్‌లు కూడా రేపటి వరకే పనిచేస్తాయని ఎస్‌బీఐ మరోసారి స్పష్టంచేసింది. కొత్త చెక్‌బుక్‌ల కోసం రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది.