1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేశాం..

బాధితుల్లో జడ్జీలు, ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘం నేతలు
56 మంది ఎస్‌వోటీ సిబ్బందితో ఈ పనిచేశాం
వాంగ్మూలంలో పేర్కొన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు
హైదరాబాద్‌,మే29 (జనంసాక్షి)
సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అంగీకరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న కీలక విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు అంగీకరించారు. కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ సాప్ట్‌వేర్‌ సాయంతో ట్యాపింగ్‌కు పాల్పడినట్టు తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్‌ ఆపేయాలని ప్రభాకర్‌రావు నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు. ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులన్నీ ధ్వంసం చేయాలని సూచించినట్లు తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి కొత్తవాటిని అమర్చామని పేర్కొన్నారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోలు, మూసారాంబాగ్‌ వద్ద మూసీ నదిలో పడేసినట్లు వెల్లడిరచారు. సీడీఆర్‌, ఐడీపీఆర్‌ డేటా మొత్తం కాల్చేసినట్లు పేర్కొన్నారు. ఫార్మాట్‌ చేసిన ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేసినట్లు తెలిపారు.

సన్నిహితులకు పోస్టింగ్‌లు
ఆ రెండు గదుల్లోని సిబ్బందికి 17 కంప్యూటర్లు, ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసినట్లు వాంగ్మూలంలో ప్రణీత్‌రావు తెలిపారు. ముఖ్యంగా ప్రభాకర్‌?రావు రాజకీయ సంబంధమైన ప్రొఫైల్స్‌ను క్రియేట్‌ చేసే పనిని తమకు అప్పగించారన్నారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకుల ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేయమని చెప్పేవారని తెలిపారు. ఇందుకోసం స్నేహితుడు, సామాజిక వర్గానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ గుండు వెంకట్రావు, చిన్ననాటి స్నేహితుడు బాలే రవి కిరణ్‌ను కూడా ప్రభాకర్‌రావు సాయంతో ఇంటిలిజెన్స్‌కు బదిలీ చేసుకున్నట్లు చెప్పారు. హెడ్‌ కానిస్టేబుళ్లు రఫీ, యాదయ్య. కానిస్టేబుళ్లు హరీశ్‌, సందీప్‌, మధుకర్‌ రావు ఉన్నారన్నారు. ప్రత్యేక ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకుని వాటి ద్వారా సుమారు 1000 నుంచి 1200 మంది ప్రొఫైల్‌లను క్రియేట్‌ చేశానని ప్రణీత్‌రావు వెల్లడిరచారు. అధికారికంగా మూడు, వ్యక్తిగతంగా మరో ఐదు చరవాణులను ఉంచుకొని ప్రభాకర్‌రావు చెప్పిన వారిని ట్రాక్‌ చేసినట్లు చెప్పారు. 2022లో ప్రభాకర్‌రావు పదవీకాలం ముగియగా తెలంగాణ ప్రభుత్వం అతనని జూన్‌ 2023వరకు ఎస్‌ఐబీ చీఫ్‌గా మళ్లీ నియమించిందన్నారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉండే వారి ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసి వారిని ట్యాప్‌ చేస్తూ మా బృందంతో కలిసి డబ్బులు సీజ్‌ చేశామన్నారు.

ఎన్నికల కమిషన్‌కు అనుమానం రాకుండా..
ఎన్నికల కమిషన్‌ నుంచి ఎటువంటి విమర్శలు రాకుండా వీటిని హవాలా డబ్బుగా రికార్డులో చూపించామని ప్రణీత్‌రావు వివరించారు. భుజంగ రావు, రాధాకిషన్‌ రావు, తిరుపతన్నల కు సమాచారన్న అందించి కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీల నేతలకు చెందిన డబ్బుపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. ఇందుకు ఎంఎస్‌ కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ అందించిన సాఫ్ట్‌వేర్‌ వినియోగించినట్లు తెలిపారు. ఎవరినైతే టార్గెట్‌ చేశామో వారి సీడీఆర్‌, ఐపీడీఆర్‌, లోకేషన్‌ కోసం cat_usaer3id తో పాటు [email protected]  ద్వారా రిక్వెస్ట్‌ పెట్టేవాళ్లమని తెలిపారు. ఫార్మేట్‌ చేసిన ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేసినట్లు వాంగ్మూలంలో ప్రణీత్‌రావు వెల్లడిరచారు.