2023 జూన్‌ నాటికి భూ సర్వే పూర్తి కావాలి


నిర్ణీత గడువులోగా లక్ష్యం చేరుకోవాలి
అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌
అమరావతి,అగస్టు12(జనం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే జూన్‌ 2023 నాటికి పూర్తి కావాలని, లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధంగా సర్వే సాగాలని ముఖ్యమంత్రి వైఎస్‌
జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. శాశ్వత భూహక్కు`భూరక్షపై ఆయన గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సవిూక్ష చేపట్టారు. అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలన్నారు. అవసరమైన సాప్టవేర్‌ను తీసుకోవాలని తెలిపారు. సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలన్నారు. సర్వే త్వరగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.ప్రతి 4 వారాలకు ఒకసారి సమగ్ర భూ సర్వేపై సవిూక్ష చేస్తా. స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే కాన్ఫరెన్స్‌లో కూడా సవిూక్షిస్తా. వారానికి ఒకసారి మంత్రుల కమిటీ కూడా సవిూక్ష చేయాలి. సమగ్ర భూ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సర్వే ఆఫ్‌ ఇండియా సహకారం తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. సవిూక్షలో మంత్రులు దర్మాన కృష్ణప్రసాద్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.