25 మంది మహిళలు ‘తాళి’ తెంచేశారు
మహిళల మెడల్లోని మంగళసూత్రాలకు ఎలాంటి మహత్తు లేదని, అవి బానిసత్వానికి చిహ్నాలని, వాటిని తెంపేసి బానిసత్వం నుంచి విముక్తులుకండంటూ తమిళనాడులోని ద్రావిడార్ కళగం చేపట్టిన తాజా ఉద్యమం హిందూ మతవాదుల ఆందోళనలతో వివాదాస్పదమైంది.వారు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జీ జస్టిస్ డీ హరి పరాంతమమ్ భావ ప్రకటన స్వేచ్ఛ కింద ద్రావిడార్ మంగళవారం తలపెట్టిన మంగళసూత్రం తెంపేసే కార్యక్రమానికి అనుమతించారు. దీనిపై హిందూ మతవాదుల ఒత్తిడి మేరకు రాష్ట్రప్రభుత్వం కోర్టు సింగిల్ జడ్జీ తీర్పుపై అప్పీల్కు వెళ్లింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని 19(2)(3)అధికరణ మేరకు ద్రావిడార్ కళగం చేపట్టిన కార్యక్రమాన్ని నిషేధిస్తున్నట్టు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. అలాగే ద్రావిడార్ కళగం ఈరోజు సాయంత్రం చేపట్టిన ‘ఆవు మాంసాహార విందు’ కార్యక్రమాన్ని కూడా కోర్టు ఉత్తర్వుల మేరకు రద్దు చేసుకుంది. మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలకు వ్యతిరేకంగా ద్రావిడార్ కళగం ఈ విందు కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంది. ప్రముఖ తమిళ నాయకుడు, హేతువాది పెరియార్ రామస్వామి స్ఫూర్తితో ద్రావిడార్ కళగం ఇలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.