దళితుడే సీఎం

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం
బిల్లు పాస్‌ చేయించడంలో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదు : జైరామ్‌ రమేశ్‌
కరీంనగర్‌, మార్చి 10 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ తేల్చిచెప్పారు. దళిత ముఖ్యమంత్రి పదవిపై ఊగిసలాటలో ఉన్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు చెక్‌ పెట్టే ప్రయత్నంలోనే భాగంగానే కాంగ్రెస్‌ ఈ కీలక ప్రకటన చేయించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్రమంత్రి జైరామ్‌ రమేశ్‌ హామీ ఇచ్చారు. దళితుడిని సీఎం చేయడం ద్వారా వారికి అండగా ఉంటామన్నారు. ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ . సోనియా తెలంగాణకు మాత కాదని నిర్మాత అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఐకాస నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే పార్టీ తరపున అవకాశం ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ పరిశ్రమలకు పన్ను రాయితీ ఉంటుందని తెలిపారు. నందమూరి తారక రామారావుకు నాడు రాజ్యసభ సీటు ఇచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ పుట్టక పోయి ఉండేదని కేంద్రమంత్రి జైరామ్‌ రమేష్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే సిఎం చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తుల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ వల్లే కిరణ్‌ సిఎం అయ్యారని తెలిపారు. ఆయన ఎన్నోసార్లు లక్ష్మణ రేఖ దాటారని చెప్పారు. కాంగ్రెస్‌ గంగోత్రి లాంటిదని, ఎంతో మంది బయటకు పోతుంటారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం సాధించడం 20-20 మ్యాచ్‌ ఆడినంత తేలికకాదు. తెలంగాణ బిల్లు ఆమోదంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎలాంటి పాత్ర పోషించలేదన్నారు. కిరణ్‌ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఏనాడు పనిచేయలేదు. కిరణ్‌ అన్ని హద్దులు దాటారు. అతని వల్లే ఇన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టు కోవడంపై జైరామ్‌ రమేశ్‌ స్పందిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఒంటరి పోరుతో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్నారు. సామాజిక న్యాయం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని ఆయన పేర్కొన్నారు.