వక్ఫ్‌ భూములను కక్కిస్తాం

2A

80 శాతం అన్యాక్రాంతం : మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి, జూన్‌ 27 (జనంసాక్షి) :

అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను కక్కిస్తామని, త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లాలోని వక్ఫ్‌ భూముల్లో 80 శాతం కబ్జాకు గురయ్యాయని ఆయన తెలిపారు. శుక్రవారం సంగారెడ్డిలో వక్ఫ్‌ భూముల అన్యాక్రాంతంపై సమీక్షించారు. అన్ని జిల్లాల్లో పరిస్థితి ఇలాగే ఉందని, హైదరాబాద్‌లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందని ఆయన తెలిపారు. కబ్జాకు గురైన భూములను వెనక్కు తీసుకుంటామని తెలిపారు. వక్ఫ్‌భూములను కబ్జా చేసినవారు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. వక్ఫ్‌బోర్డు భూముల వివరాలను సేకరించాలని అన్నారు. ఇందులో ఎవరు ఉన్నా వదిలిపెట్టమన్నారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. అలాగే వక్ఫ్‌ చట్టాలను పటిష్టం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.