లగ్జరీ వస్తువుల విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం
దిల్లీ (జనంసాక్షి ) : లగ్జరీ వస్తువుల విక్రయాలపై కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే చేతి గడియారాలు, బ్యాగులు వంటి వాటిపై 1 శాతం టీసీఎస్వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 22 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం నేడు (ఏప్రిల్ 23) ఒక ప్రకటనలో పేర్కొంది. చేతి గడియారాలు, హ్యాండ్ బ్యాగులు, రేసింగ్ గుర్రాలు, శిల్పాలు, పెయింటింగ్స్, హై ఎండ్ స్పోర్ట్స్ వేర్, హోం థియేటర్ సిస్టమ్స్, సన్గ్లాసెస్, పాదరక్షలు తదితర లగ్జరీ వస్తువులకు ఈ టీసీఎస్ వర్తిస్తుందని తెలిపింది. ఇక తాజా నిర్ణయంతో విక్రయదారులు తప్పనిసరిగా టీసీఎస్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ నిర్ణయంతో లగ్జరీ వస్తువుల అమ్మకాలపై నియంత్రణ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక విలువ కలిగిన వస్తువుల విక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.