హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

హైదరాబాద్‌ : నేటి నుండి హైదరాబాద్‌లో డీజే పై నిషేధం విధించారు. శబ్ద కాలుష్యం వల్ల డీజేను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాదులో డయల్ 100కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు , అన్ని మత పెద్దలతో చర్చ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ ఎక్విప్‌మెంట్ పరికరాలపై నిషేధాజ్ఞలు విధించబడ్డాయి. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో అనుమతించనున్నారు.ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీ, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి.

మతపరమైన ర్యాలీలలో ఎలాంటి డీజేను ఉపయోగించకూడదని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సౌండ్ సిస్టంలను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తామన్నారు. సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి అంటూ స్పష్టం చేశారు. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టంలో పెట్టడానికి పోలీసులు డెసిబిల్స్‌ను నిర్దేశించారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబెల్స్‌కి మించి సౌండ్ సిస్టంలో వాడరాదన్నారు. రాత్రి వేళలో 45 డెసిబెల్స్‌కు నుంచి సౌండ్ సిస్టంలో వాడరాదన్నారు. మతపరమైన ర్యాలీలలో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని.. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు 5000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు.