కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ వేగవంతం: కేటీఆర్

హైదరాబాద్‌ (జనంసాక్షి) : ప్రధాని మోదీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. హెచ్‌సీయూలో జరిగిన విధ్వంసం విషయంలో మోదీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. హెచ్‌సీయూలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన విధ్వంసంపై ప్రధాని మోదీ మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలి. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం. కాంగ్రెస్‌ చేసిన ఆర్థిక మోసంపై ఇప్పటికే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, సీబీఐ, ఆబీఐ, సెబీ, ఎస్‌ఎఫ్‌ఐఓలకు ఆధారాలతో సహా తెలియజేశాం. ఆర్థిక అవకతవకలు జరిగినట్టు కేంద్ర సాధికార కమిటీ కూడా నిర్ధారించింది. స్వతంత్ర విచారణ చేయాలని కేంద్ర సాధికార కమిటీ సూచించింది. ఆర్థిక అక్రమాలపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి.