గాజానూ వదలని ఇజ్రాయెల్‌

` ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ కాల్పులు..
` 45 మంది మృతి
గాజా(జనంసాక్షి): ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ మరోవైపు గాజానూ వదిలిపెట్టడం లేదు. ఐక్యరాజ్యసమితి, వాణిజ్య ట్రక్కులు ఆహారంతో వస్తుండడంతో మంగళవారం పెద్ద సంఖ్యలో శరణార్థులు గాజా స్ట్రిప్‌లో వేచి ఉన్నారు.అదే సమయంలో ఇజ్రాయెల్‌ వారిపై కాల్పులకు తెగబడడంతో 45మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వైద్యాధికారులు పేర్కొన్నారు. గాయాలపాలైన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడి సామాన్యుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మరోవైపు గాజాలోకి మానవీయ సాయం చేరకుండా ఇజ్రాయెల్‌ కట్టడి చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌ల మద్దతు ఉన్న దాతృత్వ సంస్థ, గాజా హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ (జీహెచ్‌ఎఫ్‌) పాలస్తీనీయులకు ఆహారం సరఫరా చేసే కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే.. శరణార్థులు ఆహారం కోసం వస్తున్న సమయంలో వారిని లక్ష్యంగా చేసుకొని టెల్‌అవీవ్‌ పదే పదే కాల్పులు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ విధంగా ఆహారం కోసం వేచి ఉన్న వారిపై చేసిన దాడుల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారని..వందలాది మంది గాయపడ్డారని తెలిపారు.కాగా ఆహార కేంద్రానికి నిర్దిష్ట మార్గంలోనే రావాలని ఇజ్రాయెల్‌ సైన్యం సూచించిందని టెల్‌అవీవ్‌ పేర్కొంది. అయితే ఆహారం చేజిక్కించుకోవాలన్న ఆతృతలో పలువురు ఈ మార్గం నుంచి పక్కకు వెళ్తుండడంతో వారిని అదుపు చేయడానికి మాత్రమే సైన్యం కాల్పులు జరుపుతోందని సమర్థించుకుంటోంది.