పహల్గామ్ ఉగ్రదాడి… నలుగురు ఉగ్రవాదుల ఫొటోలు విడుదల
ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తింపు
ప్రధాన సూత్రధారి ఎల్ఈటీ కమాండర్ సైఫుల్లా కసూరిగా నిఘా సంస్థల వెల్లడి
జమ్మూశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం 26 మంది పర్యాటకులు మరణించగా, పలువురు గాయపడిన ఉగ్రదాడి వెనుక ఉన్న అనుమానిత ఉగ్రవాదుల ఫొటోతో పాటు వారి స్కెచ్లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) సభ్యులే పహల్గామ్లోని ప్రసిద్ధ బైసారన్ గడ్డి మైదానంలో పర్యాటకులపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నాయి. కనీసం 5 నుంచి 6 మంది ఉగ్రవాదులు కుర్తా-పైజామాలు ధరించి, లోయ చుట్టూ ఉన్న దట్టమైన పైన్ అడవి నుంచి బైసరన్ గడ్డి మైదానానికి వచ్చి ఏకే-47 లతో కాల్పులు జరిపినట్లు నిర్ధారించాయి. ఈ దాడికి కొన్ని రోజుల ముందు లోయలోకి చొరబడిన పాకిస్థానీ ఉగ్రవాదులు ఈ బృందంలో ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. అటవీ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని అక్కడి నుంచి పారిపోయిన ఉగ్రవాదులను గుర్తించడానికి భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీనికోసం భారీగా హెలికాప్టర్లను మోహరించాయి.