ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ఊరట

న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జగదీశ్‌రెడ్డి పిటిషన్ కేవలం అపోహలపై ఆధారపడి దాఖలైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. విచారణను ప్రభావితం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కాబట్టి ఈ దశలో పిటిషన్‌ను ఎంటర్‌టైన్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ప్రతివాది రేవంత్‌రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనుకోవడం అపోహ మాత్రమేనని, అందుకు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ భవిష్యత్తులో కనుక అలాంటి పరిస్థితి వస్తే పిటిషనర్ తమను ఆశ్రయించవచ్చని పేర్కొంది. అలాగే, కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్‌రెడ్డిని ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రాసిక్యూట్ చేయాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోంమంత్రిగానూ ఉన్నారని, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ కూడా ఆయన పరిధిలోనే ఉంటుందన్న బీఆర్ఎస్ నేతల తరపు న్యాయవాదులు వాదించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టును మార్చినా దర్యాప్తు సంస్థ అదే ఉంటుంది కదా? అని ప్రశ్నించింది.