‘యుద్ధం మొదలైంది’.. ఖమేనీ సంచలన పోస్ట్!
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ ఆందోళనలను రెట్టింపు చేసింది. “యుద్ధం మొదలైంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుండటంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ప్రస్తుతం ఆయనను అంతమొందించే ఉద్దేశం లేదని ట్రంప్ పేర్కొన్నారు. తక్షణమే బేషరతుగా లొంగిపోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఖమేనీ తన అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో స్పందించారు. “యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్ (ఖడ్గం)తో ఖైబర్కు చేరుకున్నారు” అని ఆ పోస్టులో ఖమేనీ పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు ఖడ్గం ధరించి కోట ద్వారం వద్ద నిలబడిన ఒక వ్యక్తి చిత్రాన్ని కూడా జతచేశారు. ఆ చిత్రంలోని కోటపై అగ్నివర్షం కురుస్తున్నట్లుగా ఉంది.ఈ పోస్టులో ప్రస్తావించిన ‘ఖైబర్’కు చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఏడో శతాబ్దంలో యూదుల ఆధీనంలో ఉన్న ఖైబర్ పట్టణంపై షియా ఇస్లాం మొదటి ఇమామ్ అయిన అలీ యుద్ధం చేసి విజయం సాధించారు. ఆనాటి ఘటనను గుర్తుచేస్తూ ఖమేనీ ఈ పోస్ట్ చేసినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ పత్రిక తన కథనంలో విశ్లేషించింది. ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అదే సమయంలో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో కూడా పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్పై తాము హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించడం గమనార్హం.