డీజిల్ డ్రమ్‌లు తరలిస్తుండగా టిప్పర్ లోడర్ బోల్తా.. ఇద్దరు కార్మికుల మృతి

భూదాన్ పోచంపల్లి, జూన్ 4 (జనం సాక్షి): మండలంలోని పిల్లాయిపల్లి గ్రామ సమీపంలో గల శివగంగా అగ్రిగేట్స్ క్రషర్ మిల్ వద్ద మంగళవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌ఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. క్రషర్ మిల్‌కు చెందిన హిందూస్తాన్ వీల్ లోడర్‌పై డీజిల్ డ్రమ్‌లను క్వారీ ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లోడర్‌పై ప్రయాణిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నిరంజన్ (21), సతీష్ కుమార్ (22)గా గుర్తించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారి వాంగ్మూలాలు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, వాహనం సాంకేతిక పరిస్థితి, డ్రైవర్ నిర్లక్ష్యం, యాజమాన్యం బాధ్యతలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్‌ఐ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.