తెలంగాణకు ధోకా చేసినవ్‌.. భారత్‌ను మోసగిస్తున్నవ్‌

రుణమాఫీపై తెలంగాణలో చేసిన మోసాన్ని దేశమంతా చేయాలని కాంగ్రెస్‌ సిద్ధపడుతున్నది.. రుణమాఫీ అమలు చేయకున్నా చేసినట్టు పోజులు కొట్టుకోవడం దుర్మార్గం’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ దేశాన్నే తప్పుదారి పట్టిస్తున్నదని ఆయన ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ అమలుపై ప్రజలను రేవంత్‌రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ డొల్లతనాన్ని, మోసపూరిత వైఖరిని దేశమంతా గుర్తించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది రైతులకు ఎంతెం త రుణమాఫీ చేసింది? చేస్తున్న ప్రచారం ఏమిటి? వంటి విషయాలను లేఖలో ఉదహరించారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్‌ సర్కార్‌ అనుసరిస్తున్న వైఖరిని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన విషయాలను లేఖలో పేర్కొన్నారు.