దామరచర్ల ప్రాజెక్ట్ వరకు డబుల్ లైన్ వేయాలి
– బొగ్గు సరఫరాకు ఇబ్బందులు తొలగించాలి
– రైల్వే అధికారులకు జెన్కో-ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు వినతి
హైదరాబాద్,జులై 15(జనంసాక్షి):దామరచర్లలో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల అల్టా మెగా పవర్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు సరఫరా చేయడానికి అనుగుణంగా రైల్వే లైనును డబుల్ లైన్ గా మార్చాలని జెన్కో-ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు దక్షిణమధ్య రైల్వే అధికారులను కోరారు. దామరచర్ల పవర్ ప్లాంటుకు సింగరేణి నుండే మొత్తం బొగ్గును తీసుకోవాలని నిర్ణయించినందున కొత్తగూడెం నుండి డోర్నకల్ వరకు మోటమారి నుండి విష్ణుపురం వరకు 200 కిలోవిూటర్ల మేర డబుల్ లేన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దామరచర్ల పవర్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా సాగుతున్నదని, దాని మాదిరిగానే డబుల్ లేన్ నిర్మాణం, రైల్వే లైన్ పటీష్టం చేసే పనులు త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దామరచర్ల, భద్రాద్రి, కేటిపిపి పవర్ ఎ/-లాంట్లకు బొగ్గు రవాణా చేసేందుకు ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లు, భవిష్యత్తులో నిర్మించాల్సిన రైల్వే లైన్లపై సిఎండి ప్రభాకర్ రావు విద్యుత్ సౌధలో సోమవారం సవిూక్ష నిర్వహించారు. దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మేనేజర్ కె.శివప్రసాద్, చీఫ్ మేనేజర్ డి.నాగ్య, జెన్కో డైరెక్టర్లు నర్సింగ్ రావు, వెంకటరాజ్యం తదితరులు పాల్గొన్నారు. డోర్నకల్-విజయవాడ, బీబీ నగర్-నడికుడ లైన్లను కలుపుతూ కొద్ది కాలం క్రితం మోటమారి, విష్ణుపురి రైల్వే స్టేషన్ల మధ్య దక్షిణ మధ్య రైల్వే సింగిల్ లైన్ నిర్మాణం చేపట్టింది. ఆ మార్గం ద్వారానే నల్లగొండ జిల్లాలో ఉన్న సిమెంట్, లైమ్ స్టోన్స్ పరిశ్రమలకు బొగ్గు సరఫరా జరుగుతున్నది. విష్ణుపురికి సవిూపంలోనే వుండే దామరచర్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కూడా ఇదే లైన్ల నుంచి బొగ్గు సరఫరా చేయాలని దక్షిణమధ్య రైల్వే, జెన్కో నిర్ణయించాయి. ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్, దాని సామర్థ్యం దామరచర్ల విద్యుత్ ఎ/-లాంట్ కు అవసరమయ్యే భారీ మొత్తం బొగ్గును రవాణా చేయటానికి ఏ మాత్రం అణువుగా లేదని నిపుణులు తేల్చారు. దీంతో సింగిల్ లైన్ ను డబుల్ లైన్ గా చేయాల్సిన అవసరం వుందని భావించిన జెన్కో దక్షిణమధ్య రైల్వేను అప్రమత్తం చేసింది. డోర్నకల్-విజయవాడ లైన్లోని మోటమారి నుండి బీబీనగర్-నడికుడ మార్గంలోని విష్ణుపురం వరకు 100 కిలోవిూటర్ల సింగిల్ లైన్ వుంది. ఇది రోజుకు 5-6 రేక్స్ కు మించి బొగ్గును రవాణా చేయలేదు. దామరచర్ల విద్యుత్ ఎ/-లాంట్ కు ప్రతీరోజు 50వేల టన్నుల బొగ్గు కావాలి. ప్రతీరోజు 14 రేక్స్ దిగుమతి కావాలి. అంటే ఈ లైనులో 59 బోగీలున్న 14 గూడ్స్ రైల్లు ప్రతీరోజు వచ్చి పోవాలి. ఇంత సామర్థ్యం ఇప్పుడున్న లైనుకు లేదు. అటు డోర్నకల్-కొత్తగూడెం లైన్ కు పరిస్థితి కూడా అదే విధంగా వుంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం-డొర్నకల్ మార్గంలో 100 కిలోవిూటర్లు.. ఇటు మోటమారి-విష్ణుపురం మార్గంలో 100 కిలోవిూటర్లు? అంటే మొత్తం 200 కిలోవిూటర్ల మేర డబుల్ లైన్ నిర్మించాలని సిఎండి ప్రభాకర్ రావు చెప్పారు. ఖాజీపేట-బల్లార్ష మార్గంలోని ఉప్పల్ నుండి ప్రస్తుతం భూపాలపల్లి పవర్ ప్లాంటుకు బొగ్గు సరఫరా జరుగుతోంది. ఉప్పల్ రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైళ్లను ఆపి బొగ్గును దిగుమతి చేసి.. అక్కడ నుండి లారీల ద్వారా భూపాలపల్లి తరలిస్తున్నారు. ఈలైను అత్యంత రద్దీ అయిన చెన్నై-ఢిల్లీ మార్గంలోనే ఉంది. ఉప్పల్ లో అన్ లోడింగ్ వల్ల ఇతర రైళ్లకు ఇబ్బంది కలుగుతున్నదని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెప్తుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉప్పల్ నుండి భూపాలపల్లి వరకు ప్రత్యేక రైలు మార్గం నిర్మించడమో.. లేదంటే ఉప్పల్ నుండి కొద్ది దూరం రైల్వే ట్రాక్ నిర్మించి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకోవాలని రైల్వే, జెన్కో అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర నివేదిక సమర్పించాలని నిశ్చయించారు.