అగ్నిప్రమాద మృతుల సంఖ్య 7
హైదరాబాద్ : ఆదివారం రాత్రి నగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరింది. ఐదుగురు సంఘటనాస్థలంలోనే చనిపోగా మరో ఇద్దరు సోమవారం చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక దళ విభాగాలను ఆదేశించారు. ఘటనాస్థలిని సందర్శించిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడిగి ప్రమాదవివరాలు తెలుసుకున్నారు. మంటల్లో తగలబడిన అపార్ట్మెంటు, ప్రమాదానికి కారణమైన సినిమా షూటింగ్ సామాగ్రి గోడౌన్లకు మున్సిపల్ శాఖ అనుమతులు లేవని ఫైర్ ఇంజన్లు సరైన సమయానికి సంఘటనాస్థలానికి చేరుకోలేదని వార్తలు రావడంతో క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. దీంతో గోడౌన్ యజమానిపై కేసు నమోదు చేశారు.



