ఎసిబి మళ్లీ దూకుడు

ఖమ్మం, జూన్‌ 30 : మద్యం దుకాణాలకు 30వ తేదీతో పాత లైసెన్స్‌ గడువు ముగియడంతో కొత్త లైసెన్సులు కేటాయించేందుకు లాటరీ పద్ధతిన ఎక్సైజ్‌ శాఖ పూర్తి చేసింది. జులై ఒకటి నుండి కొత్త దుకాణ లైసెన్స్‌ దారులు వ్యాపారాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది మద్యం దుకాణాల్లో సిండికెట్ల అక్రమాలపై ఎసిబి మరోసారి దృష్టి పెట్టింది. పాత లైసెన్స్‌దారుల పెండింగ్‌ చిట్టాపై కన్నేసింది. మరి ఆలస్యమైతే వారి ఆచూకి కనుగొనడం కష్టమని ఎసిబి అధికారులు భావిస్తున్నారు. ఖమ్మంలోని ఎసిబి కార్యాలయంలో పలువురి నౌకరీ నామాలను పిలిచి వాగ్మూలం సేకరించారు. ఎసిబి ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఇటీవల రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలకు సమన్లు జారీ చేసి వారి స్టేట్‌మెంట్లు తీసుకున్న ఎసిబి త్వరలో పాత్రికేయులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందని ఎసిబిలో చర్చ సాగుతోంది.