కావేరీ జలాల సమస్య పరిష్కరించండి : జయలలిత

చెన్నయ్‌, జూలై 24 : కేంద్రానికి ఇప్పటివరకు లేఖలు రాసిన సిఎం జయలలిత మంగళవారం నాడు ఏకంగా మాటల తూటాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వంలో అంతర్గత పోరు అధికమైందని ఆరోపించారు. దాంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోందన్నారు. కావేరీ జలాల పంపిణీ సమస్యను పరిష్కరించలేకపోతోందన్నారు. 2007లో కావేరి జలాల గురించి చివరి తీర్పు వచ్చిందని, ఆ తీర్పును సెంట్రల్‌ గెజిట్‌లో నోటిఫై చేయాలని ప్రధాని మన్మోహన్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిమార్లు లేఖలు రాసినా నేటికీ ప్రయోజనం చేకూరలేదన్నారు. కావేరీ నది సాధికారిక సంస్థ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మే నెలలోనే ప్రధానిని కోరానన్నారు. దానిపై నేటివరకు దానిపై దృష్టిపెట్టకపోవడం దారుణమన్నారు. మిత్రపక్షాల దాడులతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోతోందన్నారు. ఇప్పటికైనా కావేరీ జలాల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నానని అన్నారు.