స్టీల్ దిగుమతులపై సుంకం డబుల్: ట్రంప్ సంచలన నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌పై సుంకాలను రెట్టింపు చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాన్ని ఏకంగా 50 శాతానికి పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పెంచిన సుంకాలు జూన్ 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉక్కు తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.”అమెరికాలోకి దిగుమతి అయ్యే స్టీల్‌పై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచబోతున్నాం. ఈ నిర్ణయం అమెరికా స్టీల్ పరిశ్రమను మరింత సురక్షితంగా ఉంచుతుంది,” అని ట్రంప్ ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అనంతరం తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో, “జూన్ 4వ తేదీ బుధవారం నుంచి స్టీల్ ,అల్యూమినియంపై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతంకి పెంచడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన స్టీల్, అల్యూమినియం పరిశ్రమలు మునుపెన్నడూ లేనంతగా పుంజుకుంటున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్!” అని ట్రంప్ రాసుకొచ్చారు.అమెరికా వాణిజ్య లోటును తగ్గించి, స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన విస్తృత సుంకాల పథకంలో భాగంగా, మార్చి నెలలో చాలా వరకు స్టీల్ దిగుమతులపై 25 శాతం సుంకం విధించారు. ఈ తాజా పెంపు ఆయన వాణిజ్య విధానాల్లో కీలకమైనదిగా భావిస్తున్నారు. మార్చిలో అమెరికాకు కొరియా స్టీల్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 340 మిలియన్ డాలర్లుగా ఉంది. హ్యుందాయ్ స్టీల్ కంపెనీ వంటివి అమెరికాలోనే తమ ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్నాయి. 2029 నాటికి లూసియానాలో 5.8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ఆధారిత స్టీల్ మిల్లును నిర్మించాలని హ్యుందాయ్ స్టీల్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది కంపెనీకి విదేశాల్లో తొలి ఉత్పత్తి కేంద్రం కానుంది.

తాజావార్తలు