గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి

మహదేవ్‌పూర్‌: ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం రాత్రి 10.66 మీటర్లు ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం 10.78 మీటర్లకు చేరుకొంది. నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాకు వెళ్లే పడవలను నిలిపివేశారు. మరోవైపు గోదావరికి వరద పోటెత్తడంతో మహదేవ్‌పూర్‌ మండలంలోని 20 గ్రామాలు రాకపోకలు నిలిచిపోయి గత నాలుగు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.