హైదరాబాద్: మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని… దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒడిశా, జార్ఖండ్ మీదుగా 7.6కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాగల 48గంటల్లో ఉత్తరు తెలంగాణలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అటు కోస్తాంధ్రలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 48 గంటల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.