తెలంగాణ ప్రకటించకపోతే ఉధృతంగా ఉద్యమిస్తాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 8 : ప్రత్యేక రాష్ట్రాన్ని దసరాలోగా ప్రకటించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 1009వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస సమన్వయ కర్త దామోదర్‌తో పాటు సభ్యులు శ్రీనివాస్‌, చెన్నారెడ్డి తదితరులు దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎంత మంది విద్యార్థులు ఆత్మబాలిదానాలకు పాల్పడినా  కేంద్రం స్పందించడంలేదని దుయ్యబట్టారు. పండుగలోగా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ప్రజా ఉద్యమంలోకి కలిసిరావాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే రాజకీయ నాయకులు రాజీనామాలకు సిద్ధపడాలని వారు అన్నారు.