పోరుదీక్షతో మా లక్ష్యం నెరవేరింది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో చేసిన పోరుదీక్షతో తమ లక్ష్యాన్ని సాధించగలిగామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా గన్‌పార్క్‌కు వచ్చిన ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ తీవ్రతను, సెగను యూపీఏ ప్రభుత్వాన్ని ఈ దీక్ష ద్వారా కదిలించామని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తెలంగాణపై తమపార్టీకున్న చిత్తశుద్దిని చాటమాన్నారు. తెలంగాణ అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానితో కూడిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లేకపోతే వారికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తెలంగాణ ఐకాసతో కలిసి గ్రామగ్రామాన తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.