మన ఊరు- మనబడి, మన బస్తీ -మనబడి ప్రభుత్వ పాఠశాలల ఆన్లైన్ నమోదు వెంటనే పూర్తి చేయాలి

 జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
 నల్గొండ బ్యూరో జనం  సాక్షి
మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల ఆన్ లైన్ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
బుధవారంనాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో జరుగుతున్న, జరగాల్సిన పనులపై ఇంజనీర్లతో సమీక్షా నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మండలంలో ఇంజనీర్లు తమకు కేటాయించిన ఎం.పి.డి.ఓ.లు, ఎం.ఇ.ఓ.లు, హెడ్ మాస్టర్లు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్ లను సమన్వయం చేసుకుని పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇంజనీర్లు ఆయా పాఠశాలలకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణానికి తగిన ప్రణాళిక వేసుకుని ప్రతిపాదనలు  రూపొందించాలని ఆయన ఇంజనీర్లను కోరారు.  ఆఫ్ లైన్ లో ఎన్ఆర్ఈజిఎస్ పనులకు అడ్మినిస్టేషన్ సాంక్షన్ పొందిన తర్వాత ఆన్ లైన్ ప్రక్రియలో ఏలా నమోదు చేయాలో ఒకటి రెండు సార్లు సరిచూసుకుని నమోదు చేయాలని, ఏలాంటి పొరపాట్లకు తావివ్వరాదని ఆయన ఇంజనీర్లకు తెలిపారు. మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల గ్రౌండింగ్ పూర్తి అయిన చోట వెంటనే పనులు ప్రారంభించాలని ఇంజనీర్లను ఆదేశిరిచారు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆన్ లైన్ పనులకు సంబంధించిన వివరాలను ఎలా నమోదు చేయాలో ఇంజనీర్లకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆర్.అండ్ బి. ఇ. ఇ. నరేందర్ రెడ్డి, పంచాయితీ రాజ్ ఇ. ఇ. తిరుపతయ్య,విద్య,సంక్షేమం, మౌళిక సదుపాయాల సంస్థ ఈ ఈ అనిత, తదితరులు పాల్గొన్నారు.