లారీ ఢీకొని బాలుడు మృతి

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): ఓ ఇసుక లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ బాలుడిని బలి తీసుకుంది. నగర శివారు వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇసుక లారీ ఢీకొని ఓ బాలుడు మృతిచెందాడు. ఆటోనగర్‌ నుండి వేగంగా వస్తున్న లారీ సుష్మా థియేటర్‌ సెంటర్‌లో సిగ్నల్‌ వద్ద యూ టర్న్‌ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ నాగులు కుమారుడు చేతన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగులుతో పాటు ఆయన కుమార్తె లావణ్యకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఎల్బీనగర్‌లోని గ్లోబల్‌ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లారీని సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.