లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కెసిఆర్ వ్యూహం
పూర్తిగా సిట్టింగ్లకు ఛాన్స్ అనుమానమే
వరంగల్లో మళ్లీ కడియం..కరీంనగర్ నుంచి హరీష్ రావు పేర్ల పరిశీలన?
హైదరాబాద్,ఫిబ్రవరి23(జనంసాక్షి): తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తామని ధీమాగా ఉన్న సిఎం కెసిఆర్ అందుకు అనుగుణంగా గెలుపు గుర్రాలను సిద్దం చేస్తున్నట్లుగా ఆయన తీసుకుంటున్న చర్యలు స్పష్టం చేస్తున్నాయి. 16 స్థానాలు తెరాస గెలుచుకుంటుంనది ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే ప్రకటిస్తున్నారు. దీంతో ఇందుకు అనగుణంగా వ్యూహాలు పన్నుతున్నారు. తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాల్లో తెరాసపై ప్రజల్లో పూర్తిగా సానుకూలత వ్యక్తమయిందని కూడాచెప్పారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యానే సీనియర్ నేతలకు మంత్రిపదవులు దక్కలేదని కెసిఆర్ ఇటీవల కేబినేట్ భేటీలో వెల్లడించారు. దీనిని బట్టి కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవసరమున్న చోట ఎంపిలుగా బరిలోకి దింపాలని చూస్తున్నట్లు స్పష్టం అవుతోంది. టిఆర్ఎస్ వర్గాల్లో కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరిని మరోమారు వరంగల్ లోక్సభ స్థానంలో నిలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే హరీష్ రావును కరీంనగర్ నుంచి, కెసిఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డిని మరోమారు నల్లగొండ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హరీష్రావును తనతో పాటుకేంద్ర రాజకీయాల్లో వెంట తీసుకుని వెళ్లాలన్న ఆలోచనలో కూడా కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ఇనకల తరవాత కీలక భూమిక పోషించబోతున్న తరుణంలో గతంలోలాగానే హరీష్ను వెన్నంటి ఉండేలా చూసకుంటున్నారు. శాసనసభ ఎన్నికలకంటే ఇప్పుడు టిఆర్ఎస్ పట్ల ఆదరణ మరింత పెరిగిందని సిఎం విశ్వాసంతో ఉన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసిన ప్రతిపాదనలతు చూస్తే భరోసా వ్యక్తం అవుతోంది. ఓటాన్ అకౌంట్ అయినా ప్రజల కోణంలో ప్రవేశపెడుతున్నామని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు అంశాలన్నింటిని చేరుస్తున్నామని చెప్పారు. విస్తరణ తర్వాత తక్కువ గడువు ఉన్నందున తానే ఆర్థిక శాఖ బాధ్యతలతో బ్జడెట్ను ప్రవేశపెడుతున్నట్లుగా సీఎం వివరించినతీరు అద్దం పడుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారని కేసీఆర్ విశ్వాసంతో ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో తెరాసకు లోటు ఏర్పడిందని, పార్లమెంటు ఎన్నికల్లో దానిని భర్తీ చేసి, భారీమెజారిటీతో గెలవనున్నామని తెలిపారు. 16 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. మంత్రులు పార్టీ బలోపేతంపైనా దృష్టి సారించాలని, వారి వారి జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్లాలని సీఎం ఇప్పటికే సూచించారు. పార్టీ శ్రేణులకు అండగా ఉండాలన్నారు. శాసనసభ కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల పక్రియ మొదలైంది. మొత్తం అయిదు స్థానాలకు గాను నాలుగు స్థానాలకు అబ్యర్థులను ప్రకటించారు. ఒకటి మిత్రపక్షం ఎంఐఎంకు కేటాయించారు. ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలు తెరాస అభ్యర్థులకే దక్కుతాయని ధీమాగా ఉన్నారు. అయితే నోటిఫికేషన్ వస్తే వీటికి కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు. మొత్తంగా ఎంపి స్థానాల్లో ఎంపిక అన్నది పాతవారినే కొనసాగించే అవకాశం కనిపించడం లేదు. మళ్లీ తెరపైకి కొత్తవారిని తీసుకునిరావడం ఖాయంగా కనిపిస్తోంది.