వ్యయం ఘనం.. ప్రయోజనం శూన్యం

` కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా అదనపు ప్రయోజనం లేదు
` కాగ్‌ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కాగ్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2022 మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కాగ్‌ పేర్కొంది. అప్పటి బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు తక్కువగా ఉందని వెల్లడిరచింది.విద్య, వైద్యం, నీటిపారుదల తదితర రంగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్‌ పేర్కొంది. రీ ఇంజినీరింగ్‌, మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని.. దీంతో రూ.765కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.’’రెవెన్యూ రాబడి ఎక్కువ.. లోటును తక్కువగా చూపించారు. విద్య, వైద్యంపై ఖర్చులో రాష్ట్రం వెనుకబడి ఉంది. మొత్తం వ్యయంలో విద్యపై 8 శాతం, ఆరోగ్యంపై కేవలం 4 శాతమే ఖర్చు చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకంపై పురోగతి లేదు. విభజన ఆస్తుల పంపకాలపై తగినంత దృష్టి పెట్టలేదు. రూ.1.18లక్షల కోట్ల రుణాలను బడ్జెట్‌లో పేర్కొనలేదు. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంటుంది. రుణాలపై 2032`33 నాటికి రూ.2.52లక్షల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.కాళేశ్వరం పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించింది. డీపీఆర్‌ ఆమోదానికి ముందే రూ.25వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారు. అవసరం లేకున్నా మూడో టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల రూ.25వేల కోట్లు అదనంగా ఖర్చయింది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42లక్షలు అవుతుంది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51శాతంగా అంచనా వేశారు.. కానీ అది 0.75 శాతంగా తేలుతోంది. అది మరింత తగ్గే అవకాశముంది. భూకంప సంబంధిత అధ్యయనాలు సమగ్రంగా చేయకుండానే మల్లన్న సాగర్‌ను నిర్మించారు’’ అని నివేదికలో కాగ్‌ పేర్కొంది.ఆసరా పింఛన్ల పంపిణీపై కాగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. పంపిణీలో అవకతవకలు జరిగాయని తేల్చింది. 2018`21 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆడిట్‌ ఆధారంగా కాగ్‌ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం..’సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. ఆసరా డేటా బేస్‌, సమగ్ర కుటుంబ సర్వే మధ్య వ్యత్యాసం ఉంది. వినియోగించని మొత్తం బ్యాంకు ఖాతాలో ఉంది.. కానీ సెర్ప్‌ మాత్రం పూర్తిగా చెల్లించినట్లు నివేదిక ఇచ్చింది. 2018`21 మధ్య కాలంలో సగటున నెలకు 2.3లక్షల మందికి చెల్లింపులు జరగలేదు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 16 శాతం మందికి అర్హత లేకున్నా పింఛన్లు జారీ చేశారు. దరఖాస్తు, పరిశీలన, ఆమోదానికి సంబంధించి సరైన విధానం పాటించలేదు. దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళల పింఛన్లలో రూ.535కోట్ల అక్రమ చెల్లింపులు జరిగాయి. మృతి చెందిన 367 మంది పేర్లను కూడా కొనసాగించి కొన్ని నెలలపాటు చెల్లింపులు జరిపారు. భూస్వాములు, కార్లు ఉన్న వాళ్లకు కూడా ఆసరా పింఛన్లు అందాయి. అనర్హులుగా గుర్తించినప్పటికీ 2లక్షల మందికి రూ.1175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు చేశారు. ఆసరా డేట్‌ బేస్‌ భద్రత విషయంలో సరైన మార్గదర్శకాలు పాటించలేదు. కీలకమైన సమాచామంతా బ్యాకప్‌ లేకుండా ఒకే చోట ఉంచారు’’అని కాగ్‌ పేర్కొంది.