అంతర్జాతీయ రాకపోకలకు అనుమతి

దిల్లీ,అక్టోబరు 22(జనంసాక్షి): కొవిడ్‌-19 మహమ్మారి వల్ల తలెత్తిన అత్యయిక పరిస్థితి నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ప్రయాణాలపై విధించిన ఆంక్షలను కేంద్రం దశల వారీగా సడలించనుంది. ఈ క్రమంలో దేశంలోకి భారతీయులు, విదేశీయుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ¬ంశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పర్యాటక వీసా మినహా అన్ని వర్గాల ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే ప్రయాణికులందరూ ఆరోగ్య శాఖ సూచించిన ప్రకారం క్వారంటైన్‌ తదితర నిబంధనలను పాటించాల్సి ఉంటుందని వివరించింది.విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (ఓసీఐ), భారతీయ మూలాలున్న వ్యక్తులతో (పీఐఓ) సహా విదేశీయులెవరైనా జల, ఆకాశ మార్గాల ద్వారా భారత్‌కు వచ్చేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వందే భారత్‌ మిషన్‌, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం లేదా పౌర విమానయాన శాఖ గుర్తించిన ఏ విమాన సర్వీసుల ద్వారా వచ్చే ప్రయాణికులనైనా అనుమతిస్తామని వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న వీసాలన్నింటినీ క్రియాశీలం చేస్తున్నట్టు ¬ంశాఖ ప్రకటించింది. ఎలక్ట్రానిక్‌ , పర్యాటక, వైద్య సంబంధ వీసాలు మినహా ఇతర వీసా సేవలన్నిటినీ పునరుద్ధరించనున్నారు. ప్రయాణికుల వీసా చెల్లుబాటు తేదీ మించినట్లయితే, కొత్త వీసాలను సంబంధిన భారతీయ సంస్థలనుంచి పొందవచ్చని సూచించింది. ఇక వైద్య చికిత్స తదితర కారణాల వల్ల భారత్‌కు రావాలనుకునే విదేశీయులు, వారికి సహాయంగా వచ్చే వారు కూడా మెడికల్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.