అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీక్‌

తీవ్రంగా పరిగణించిన సిఎం జగన్‌
అధికారులతో సవిూక్షించి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
సెజ్‌లలో రక్షణచర్యలు చేపట్టాలని ఆదేశం

అమరావతి,అగస్టు3(జనం సాక్షి):అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీక్‌ ఘటనను తీవ్రంగా పరిగణించాలని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేప్టీ ఆడిట్‌ జరిపించాలన్నారు.
అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీక్‌ ఘటనపై ముఖ్యమంత్రి జగగన్‌ అధికారులతో సవిూక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం ఆరా తీశారు. విషవాయువు లీక్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలను వెలికితీయాలన్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేప్టీ ఆడిట్‌ జరిపించాలని అధికారులను ఆదేశించారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీకైంది. సీడ్స్‌ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా దాదాపు 100మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు
గురయ్యారు. వాంతులు, వికారంతో స్పృహ తప్పి పడిపోయారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే కొందరికి ప్రథమచికిత్స అందించారు. మరి కొందరిని ఫ్యాక్టరీ బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. పెద్ద సంఖ్యలో మహిళలు వాంతులు, వికారంతో ఆర్తనాదాలు చేశారు. బి షిప్ట్‌లో ఫ్యాక్టరీలో దాదాపు 4 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా వారిలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.జూన్‌ మొదటి వారంలో కూడా ఇదే ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకై పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్‌ దుస్తుల కంపెనీ, సవిూపంలోని పోరస్‌ లాబ్స్‌ను దాదాపు వారం రోజుల పాటు మూసివేసి ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని ఐఐసీటీ సహా ఇతర అధికారులతో రసాయన వాయువు లీకేజీపై నివేదికలు తీసుకున్న ప్రభుత్వం వాటిని ఇప్పటి వరకు బహిర్గతం చేయకపోవడం గమనార్హం.