అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా– అక్కడికక్కడే యువకుడు మృతి

టేకులపల్లి, ఆగస్టు 27 (జనం సాక్షి): అతివేగంతో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఇల్లందు ,కొత్తగూడెంప్రధాన రహదారిలోని బొమ్మనపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన బానోతు బన్సీలాల్ కుమారుడు బాలచందర్( పండు) సొంత ట్రాక్టర్ పై వ్యవసాయ దుక్కి దున్నడం కోసం ట్రాక్టర్కు కల్టివేటర్ తగిలించుకొని రోడ్డుపై వెళ్తున్న క్రమంలో కల్టివేటర్ కొమ్మ గొలుసు ఊడిపోవడంతో ట్రాక్టర్ టైర్ కు తగిలి బోల్తా కొట్టింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బన్సీలాలకు ఒక్కడే కుమారుడు, కుమార్తె ఉన్నారు.ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంతో కంటనీరు పెట్టారు. టేకులపల్లి ఎస్సై భుక్య శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.