అధికారంలోకి రాగానే హామీల అమలు

` మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి(జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌హయాంలో కులవృత్తులకు ప్రోత్సాహం కల్పించాడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం వడ్డెర, గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోను అమలు చేస్తామన్నారు. అర్హులైన ప్రతి మహిళకు సౌభాగ్యలక్ష్మి కింద ప్రతినెలా రూ.3 వేలు భృతి చెల్లిస్తామని పేర్కొన్నారు.రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధి విూ కండ్ల ఎదుట కనబడుతున్నదన్నారు. గీతా కార్మికులకు బీమా పథకాన్ని తీసుకొచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ కార్యవర్గాన్ని ఒప్పించి పాలిటెక్నిక్‌ భవనం ఎదుట సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయించాని విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఎకరా స్థలాన్ని గౌడ భవనం కోసం కేటాయించామన్నారు.అనంతరం మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని, ఇప్పుడు కొనసాగుతున్న సంక్షేమాలు కొనసాగాలంటే విూరందరూ ఒక్కతాటిపైకి వచ్చి మద్దతుగా నిలవా లన్నారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన 200 మంది మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూర్‌ ప్రమోద్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.