కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది

31అక్టోబర్ జనంసాక్షి :రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు . హైదరాబాద్లోని పలువురు ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు
నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అన్నారు. తులం బంగారం ఇస్తాం.. యువతులకు స్కూటీలు ఇస్తాం.. వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామంటూ.. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కేటీఆర్ కోరారు. ఉప ఎన్నికలో డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. అయితే.. ఆ డబ్బులు తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలని అన్నారు. ఇవి కారుకు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ఆయన అభివర్ణించారు. పేదల ఇండ్లు కూలగొట్టిన ఈ బుల్జోజర్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలపై కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని ఆయన ధైర్యం చెప్పారు. మీరు ధైర్యం చేయండి.. ఎవరైనా బెదిరిస్తే వారి సంగతి తర్వాత చూద్దామని అన్నారు. ప్రజలకు తాము ఎప్పటికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా పనిచేయాలని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు .
.
 
             
              


