అన్ని చెరువుల్లోకి నీరుచేరేలా చర్యలు

జనగామ,నవంబర్‌11(జ‌నంసాక్షి): దేవరుప్పుల, గుండాల మండలాల చెరువులు నిండే వరకూ నవాబుపేట రిజర్వాయర్‌ నుంచి నీరు వస్తూనే ఉంటుందని, వివిధ గ్రామాల రైతులు సంయమనం పాటించి చెరువులు నింపుకోవాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ మండలాలల్లో ప్రవహిస్తున్న దేవాదుల కాలువలను రైతులు పరిశీలించాలన్నారు. రైతులు తమ చెరువులే నిండాలనే పట్టుదలతో విచక్షణా రహితంగా కాలువలకు గండ్లు పెడుతుండడం సరికాదన్నారు. ఈ రెండు మండలాల్లో అన్ని చెరువులు నిండేలా తాను నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడుతానని, రైతులు తొందర పడి గండ్డు పెట్టొద్దన్నారు. నీటి సరఫరా విషయంలో సమతౌల్యత పాటించాలని సక్రమంగా ప్రవహించేలా చూడాలని అన్నారు. ఈ విషయంలో గుండాల జెడ్పీటీసీ సహకరించాలన్నారు. రామరాజుపల్లి, నీర్మాలకు వచ్చే కాలువను దగ్గరుండి నీరు అధికంగా వచ్చేలా మట్టి పోయించారు. అనంతరం సింగరాజుపల్లి సింగరాయ చెరువు నిండుతున్న తీరును పరిశీలిచారు. ఇకదేవరుప్పుల,గుడి చెరువు, చినమడూరు గోపి చెరువు, సింగరాజుపల్లి, పెదమడూరు చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.