అభివృద్ది నినాదంతో ప్రచారం: పైళ్ల

భువనగిరి,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): అభివృద్ది మా నినాదమని..అందకు కెసిఆర్‌ చేపట్టిన పథకాలే రుజువని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. ఈ రెండు అంశాలతో ప్రచారం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు.

గత నాలుగున్నరేండ్ల పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసి ప్రతి పక్షాలకు డిపాజిట్‌ దక్కకుండా చేయాలని తెలిపారు.మహకూటమి పేరుతో రాష్ట్రాన్ని మరోమారు దోచుకోవటానికి వస్తున్న ప్రతిపక్షాలకు తగిన బుద్ధిచెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌లో ఉన్నవారంతా కీలక పాత్ర పోషించాలని శేఖర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు. రాబోయే ఎన్నికల్లో బంగారు తెలంగాణ సాధన కోసం, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు కంకణబద్దులై పనిచేయాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని అన్ని విభాగాల నాయకులకు అవకాశం కల్పిస్తామన్నారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఎన్నికల్లో పనిచేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపులను ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా పాలన సాగించిన కేసీఆర్‌కు మరోమారు అవకాశం ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు.