అభ్యాస్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

 

జహీరాబాద్ సెప్టెంబర్ 3( జనంసాక్షి)
మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో స్థానిక అభ్యాస్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ సూరి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించి విద్యార్థులకు మోటారు వాహనాల చట్టం, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి దశ చాలా కీలకమైనదని, సమయ పాలన పాటించాలని, చెడుకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించాలని, ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఎవ్వరూ, లైసెన్స్, హెల్మీట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఒకవేళ పై నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపి ప్రమాదానికి కారణమైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ దత్తాత్రేయ రెడ్డి, న్యాయవాదులు గోపాల్, శంకరయ్య, విశ్వనాధ్, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్, పట్టణ ఎస్సై శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపాల్ మ్యాతరి చిన్న, యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.