అయోధ్య తీర్పుపై.. మళ్లీ సుప్రీంకు ఏఐఎంపీఎల్‌బీ

 

– డిసెంబర్‌ మొదటివారంలో రివ్యూపిటీషన్‌ దాఖలకు నిర్ణయం

న్యూఢిల్లీ, నవంబర్‌27(జనం సాక్షి) : బాబ్రీ మసీదు- రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయనున్నట్టు ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ప్రకటించింది. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును వినియోగించుకుంటూ వచ్చే నెల మొదటి వారంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు ఏఐఎంపీఎల్‌బీ బుధవారం వెల్లడించింది. కాగా రివ్యూ కోరకూడదంటూ సున్నీ వక్ఫ్‌ బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల తమ కేసుకు చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై తాము రివ్యూకి వెళ్లబోమంటూ మంగళవారం ఉత్తర ప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మసీదు నిర్మాణం కోసం సుప్రీంకోర్టు కేటాయించిన ఐదు ఎకరాలు స్వీకరించాలా లేదా అన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. బాబ్రీ మసీదు- రామ జన్మభూమి వివాదం కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 9న తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి మొత్తాన్ని రామ్‌ లల్లాకి అప్పగించాలనీ… మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో 5 ఎకరాల భూమి కేటాయించాలని సుప్రీం ఆదేశించింది.