కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ వశం..!
కరీంనగర్ బ్యూరో (జనంసాక్షి) : మేయర్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించడంతో ఉత్కంఠకు తెర పడింది. మొత్తం 66 స్థానాల్లో 30 కార్పోరేటర్లను గెలుచుకున్న బీజేపీకి ఇద్దరు స్వతంత్రులు, రెండు ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి 34 సభ్యులు బలం ఉంది. దీంతో కరీంగనర్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కావాల్సిన బలం చేకూరడంతో తెలంగాణ చరిత్రలో మొదటి సారి బీజేపీ కరీంనరగ్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు లైన్ క్లియర్ అయింది. దీంతో బండి సంజయ్ వర్గంలో, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
కాంగ్రెస్కు 14 మంది, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, స్వతంత్రులు 5, ఏఐఎఫ్బీకు చెందిన ఇద్దరు కలిపి ప్రత్యర్థుల సంఖ్య 33కి చేరింది. ఆదివారం మద్దతు పలికిన మరో ఏఐఎఫ్బీ సభ్యురాలు, ఎక్స్అఫిషియో ఓటుతో వారి బలం 35కు పెరిగింది. నిన్నటి వరకు మేయర్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి కొమురయ్య పేరు వినిపించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్బీ, స్వతంత్రులు కలిపి ఆయనకు మద్దతుగా నిలుస్తారనే ప్రచారం జరిగింది. అయితే అధికార కాంగ్రెస్ ఆదివారం తమపార్టీకి చెందిన ఒకరిద్దరి పేర్లను తెరమీదకు తెచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మద్దతు ఇవ్వటం లేదని తేలడంతో బీజేపీకి లైన్ క్లియర్ అయింది.



