అవినీతి నిర్మూలనలో కేజ్రీవాల్‌ విఫలం

2

– పెదవి విరిచిన అన్నా హజరే

ముంబై,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రజల్లో చిరస్థాయి పేరు సాధించిన అన్నా హజారే కూడా కేజ్రీవాల్‌ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు.  అరవింద్‌ కేజీవ్రాల్‌పై తాను పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఒకప్పటి తన సహచరుడు, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రికేజీవ్రాల్‌ అన్నాను తీవ్ర నిరాశకు గురి చేశారు.  కేజీవ్రాల్‌ చాలా ఏళ్లు తనతో ఉన్నారని, దేశ రాజకీయాల్లో ఆయన సరికొత్త ఒరవడిని తీసుకువస్తారని ఆశించానని, దేశానికి దిశానిర్దాశం చేస్తారని అనుకున్నానని హజారే చెప్పారు. ఇప్పుడు ఆయన సహచరులు చేస్తున్న పనులు, ముఖ్యంగా కొందరు జైలుకు వెళ్లడం, మరికొందరు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం తనకు చాలా బాధ కలిగించిందని హజారే ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వంలోని కొందరు మంత్రులు జైలుకు వెళ్లడం, మరికొందరిపై ఆరోపణలు రావడం తనను ఆవేదనకు గురిచేస్తోందని ఆన్నా అన్నారు. ‘నాకు చాలా ఆవేదనగా ఉంది. కేజీవ్రాల్‌ నాతో ఉన్నప్పుడు ‘గ్రామ్‌ స్వరాజ్‌’ పేరుతో ఒక పుస్తకం రాశారు. ఇదేనా గ్రామ్‌ స్వరాజ్‌ అంటే? ఇందుకు నేను బాధపడుతున్నాను. కేజీవ్రాల్‌పై తాను పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయని హజారే అన్నారు. ఇక మహిళపై అత్యాచారం కేసులో మంత్రి పదవిని కోల్పోయిన ఆప్‌ ఎమ్మెల్యే దీప్‌కుమార్‌ను మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. మరికొందరు ఆప్‌ నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. దీనిపై హజారే స్పందిస్తూ, అప్పట్లో పార్టీ ప్రస్తావన వచ్చినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు ప్రపంచం మొత్తం చుట్టాల్సి వస్తుందని, పార్టీలో చేరే వ్యక్తులు మంచివారో, చెడ్డవారో ఎలా గుర్తిస్తావని తాను కేజీవ్రాల్‌ను ప్రశ్నించానని అన్నారు. అయితే అందుకు కేజీవ్రాల్‌ సమాధానం చెప్పలేకపోయారని హజారే గుర్తుచేసుకున్నారు. కానీ అది ఇప్పుడు నిజమైందని అన్నారు. అద్భుతాలు సృష్టిస్తాడని అరవింద్‌ కేజీవ్రాల్‌పై తాను పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని అన్నా హజారే ఈ సందర్బంగా అన్నారు. కేజీవ్రాల్‌ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు జైళ్లకు వెళ్తుండటం, అవినీతికి పాల్పడుతుండటంపై తీవ్ర మనస్థాపానికి గురైనట్లు హజారే వెల్లడించారు.మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై ఆప్‌ ఎమ్మెల్యే సందీప్‌ కుమార్‌ అరెస్ట్‌ అవడంపై హజారే ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎలాంటి వ్యక్తులు వస్తున్నారో చూసుకోవాలని తాను ముందే కేజీవ్రాల్‌ను హెచ్చరించినట్లు హజారే గుర్తు చేశారు. కేజీవ్రాల్‌ తనతో చాలా ఏళ్లు కలిసి ఉన్నారని, ఆయనపై తనకెంతో నమ్మకం ఉండేదని, దేశ రాజకీయాల్లో కేజీవ్రాల్‌ ఏదో కొత్తగా చేసి దేశాన్ని ఓ కొత్త దిశలో నడిపిస్తారని నమ్మేవాడినని హజారే తెలిపారు. అయితే ప్రస్తుత పరిణామాలతో ఆ నమ్మకం పోయిందని స్పష్టంచేశారు.