ఆ నలుగురిపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు

టీడీపీనే మేం బహిష్కరించాం : హరీశ్వర్‌రెడ్డి
హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి):
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారని తమ నలుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం సస్పెండ్‌ చేశారు. సస్పెండయిన ఎమ్మెల్యేల్లో ఒకరైన రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌ చంద్ర బాబుపై నిప్పులు చెరిగారు. బాబు తనను సస్పెండ్‌ చేయడం కాదు, తానే టీడీపీని సస్పెండ్‌ చేశానని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏడాదిన్నర కిందటే తాను పార్టీకి రాజీనామా చేశానని, తనను సస్పెండ్‌ చేశానని ప్రకటించుకోవడం బాబు అవివేకానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు వల్లే తెలంగాణ రాకుండా పోయిందని, ఆయన పక్కా తెలంగాణ ద్రోహి అని హరీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకపోయినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. టీడీపీలో ఉంటే తెలంగాణ నాయకులకు భవిష్యత్తు లేదని, ఇప్పటికైనా బాబు కబంధ హస్తాల నుంచి టీటీడీపీ ఫోరం నాయకులు బయటకు రావాలని హితవు పలికారు.