ఇరాక్‌లో వరుస పేలుళ్లు ‘ 43 మంది మృతి

బాగ్దాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి):
ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో ముష్కరులు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 43 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ
వారిని హుటాహుటిన సవిూప ఆస్పత్రుల్లో చేర్పించారు. హిల్లా పట్టణంలో షియా ముస్లింలు ఏర్పాటు చేసుకున్న టెంట్లకు సవిూపంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 29 మంది మృతి చెందగా.. 90 మందికిపైగా గాయపడ్డారు. అంతకుముందు బాగ్దాద్‌కు 90 కిలోవిూటర్ల దూరంలో ఉన్న షియా పట్టణం కర్బాలాలో నిలిపి ఉంచిన కారులో పేలుడు జరిగి ఆరుగురు మృతి చెందారు. ఫల్లుజా పట్టణంలో పోలీసు వాహనాల లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో ముగ్గురు, మోసుల్‌లో నిలిపి ఉంచిన కారులో పేలుడు చోటుచేసుకొని ఇద్దరు, తాజీ పట్టణంలో ఒకరు మృతి చెందారు. ఈఘనలతో ఇరాక్‌ పట్టణాలు అట్టుడికాయి. వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేశారు.