ఈ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేయాలి

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి
ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
–  వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సత్యవతి రాథోడ్ , సీఎస్ సోమేశ్ కుమార్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):ఈ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి గ్రామ ,డివిజన్ ,జిల్లా సభలు పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  అధికారులను ఆదేశించారు.శుక్రవారం పోడు భూముల సర్వే ,ధరణి దరఖాస్తులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో  రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోడు భూముల సర్వే ప్రక్రియ పకడ్బందీగా పూర్తిచేయాలని,ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజల సందేహాలు నివృత్తి చేస్తూ కట్టుదిట్టంగా సర్వే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.డిసెంబర్ నెల మొదటి వారంలో అర్హులైన వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, నెలాఖరు వరకు పోడు భూముల సర్వే, గ్రామ , డివిజన్, జిల్లా స్థాయి సభలు నిర్వహణ పూర్తి కావాలని పేర్కొన్నారు.జిల్లాలలో ఎట్టి పరిస్థితులలో నూతన అటవీ భూముల ఆక్రమణకు అనుమతించరాదని , అటవి శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.భవిష్యత్తులో అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా గ్రామ సభల్లో తీర్మానం చేయాలని తెలిపారు.సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యం మేరకు భూ సర్వే పనులు, గ్రామసభల నిర్వహణ పూర్తి కావాలని, దీని కోసం రాష్ట్ర సిఎస్ అటవీ శాఖ ఉన్నతాధికారులు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.అనంతరం సిఎస్ సోమేష్ కుమార్ పోడు భూముల సర్వే ప్రక్రియ పురోగతిపై జిల్లాల వారీగా రివ్యూ నిర్వహించారు.ధరణి టిఎం 33 మాడ్యులలో పెండింగ్ దరఖాస్తుల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షించారు.ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు.అనంతరం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ 2007 పై సంక్షేమ కమిషనర్ దివ్య రివ్యూ నిర్వహించారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చిన 7373 పోడు భూముల ధరఖాస్తులలో ఇప్పటివరకు 7220 దరఖాస్తులు పరిశీలించామని, జిల్లాలో ఇంకా 153 పోడు భూముల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.51 టీంలు ఏర్పాటు చేసి పోడు భూముల సర్వే నిర్వహిస్తున్నామని, నవంబర్ 20 నాటికి సర్వే పూర్తి చేస్తామని తెలిపారు.నేటి నుండి గ్రామాలలో గ్రామసభలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు,ఎస్పీ రాజేంద్రప్రసాద్, అటవి శాఖ అధికారి వి.సతీష్ కుమార్, డిఎస్పీ నాగభూషణం, ఆర్డిఓలు వెంకారెడ్డి,  రాజేంద్ర కుమార్, కిషోర్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.