ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

 

పౌరిగల్వార్‌(జ‌నం సాక్షి): ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పౌరిగల్వార్‌ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా 42 మంది మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 30 మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు.

సుమారు 45మంది ప్రయాణికులతో రామ్‌ నగర్‌ నుంచి బస్సు భోహన్‌కు బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. బస్సులో లోయలో పడిన అనంతరం మరింత లోతుకు జారిపడటం వల్లనే మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.