ఉన్నవ్ అత్యాచార బాధితురాలి..
వాంగ్మూలం నమోదు
న్యూఢిల్లీ, సెప్టెంబర్11 ( జనంసాక్షి ) : ఢిల్లీ ఎయిమ్స్లో ఉన్నవ్ అత్యాచార ఘటనపై ప్రత్యేక జడ్జి ధర్మేష్ శర్మ విచారణ చేపట్టారు. బుధవారం ఉదయం ఎయిమ్స్కు చేరుకున్న ప్రత్యేక జడ్జి.. అక్కడ చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఢిల్లీ కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్లోనే తాత్కాలిక కోర్టు ఏర్పాటు చేశారు. అయితే తాత్కాలిక కోర్టులో విచారణ చేపట్టిన సమయంలో నిందితుడు బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెనగర్ కూడా ఉన్నారు. అయితే కేసు విచారణ, బాధితురాలి వాంగ్మూల నమోదును బయటకు రానివ్వొద్దని కోర్టు గట్టిగా ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ విూడియాను అనుమతించలేదు. ఆడియో, వీడియో రికార్డింగ్కు కూడా అనుమతివ్వలేదు. తాత్కాలిక కోర్టు ఏర్పాటు చేసిన సెమినార్ హాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా స్విచ్ఛాప్ చేశారు. 16ఏళ్ల అమ్మాయిపై ఎమ్మెల్యే కుల్దీప్ రెండేళ్ల క్రితం(2017) ఉన్నావ్లో రేప్ చేశాడు. ఆ కేసుకు సంబంధించిన బాధితురాలు కారులో వెళ్తుంటే ఈ ఏడాది జులై చివరి వారంలో లారీతో ఢీకొట్టారు. ఆ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. బాధితురాలి పరిస్థితి కూడా విషమంగా ఉంది. బాధిత ఫ్యామిలీ రాసిన లేఖను సుప్రీం ఇవాళ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం విదితమే. కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలికి ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.