ఉల్లి ధరలను పట్టించుకోని పాలకులు 

నిత్యావసర ధరలు స్వారీ చేస్తున్నా పట్టింపు లేని నేతలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌21( జనం సాక్షి):): బీహార్‌ ఎన్నికల హడావిడిలో అన్ని పార్టీలు పరస్పర ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్ప ప్రజలకిచ్చిన వాగ్దానాలను పట్టించుకోవడం లేదు. పాలకులు ఎవరికివారు ప్రజలకిచ్చిన హావిూలు నెరవేర్చామని చెప్పుకుంటున్నారు. దేశంలో ఓవైపు వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. పంటలన్నీ నీట మునిగాయి. ఈ దశలో కూరగాయలతో పాటు, ఉల్లి ధరలు అమాంతంగా పెరిగాయి. ఉల్లి కనీస ధర మళ్లీ 60కి తగ్గడం లేదు. వరదల కారణంగా వందను దాటుతుందని, గతేడాది లాగే ధరలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ధరలు పెరుగుతున్న వేళ ప్రధానంగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చిన తరవాత సామాన్యుల కలలు సాకార మయ్యాయా.. ఇచ్చిన హావిూలు నెరవేరాయా అన్నది చూసుకోవాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్వాంత్య్రం సిద్దించి ఏడు దశాబ్దాలు దాటినా  ఇంకా పేదల

ఆకలిదప్పులు తీరడం లేదు. అత్యాచారాలు పెరిగాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చదువుకుందామంటే అది ఖరీదైన వస్తువుగా మారింది. చదువులను కొనలేని దుస్థితి ఏర్పడింది. ఇలాంటి సమస్యలను పరిష్కరించడమే ముఖ్యం గానీ తాము అనుకున్న రీతిలో పనులు చేస్తూ అవే ప్రజా సమస్యల పరిష్కారం అని తలపోసేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి రాగానే మరో ఐదేళ్లు గద్దెపై ఉండడమెలా అన్న ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలు  చేయడం వల్లనే భారత్‌ ఇన్నేళ్ల తరవాత కూడా ఇంకా దారిద్యం, నిరక్షరాస్యత, వసతుల కొరత, ఆహార ధాన్యాల కొరతతో అలమటిస్తోంది. దేశంలో ఇప్పటికీ సరైన ప్రజారోగ్య వ్యవస్థ లేదు. వ్యవసాయ రంగం కుంగి కృషించిపోతోంది. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆహారధాన్యాలకు మద్దతు ధరలు అందడం లేదు. విద్య మిధ్యగా మారింది. ఉద్యోగాల కల్పన అంతంత మాత్రంగానే ఉంది. ప్రజలు స్వేచ్ఛగా బతికేలా, ఆర్థికంగా ఎదిగేలా, పనిచేసుకుంటే పనిదొరికేలా పాలన చేయాలి. కేవలం వాగాడంబరాలతో ఎంతోకాలం ప్రజలను మభ్య పెట్టలేమని గుర్తించాలి. తాము చేస్తున్న పనుల వల్ల క్షేత్రస్థాయిలో మార్పులు వచ్చాయా లేదా అన్నది పాలకులు గమనించడం లేదు.  విమర్శలను సానుకూల దృక్పథంతో తీసుకుని ముందుకు సాగడం లేదు. ఇంతకాలం ఎక్కడ లోపం ఉందో గుర్తించి అవలోకనం చేసుకోవాలి. రాజకీయాలను పక్కన పెట్టి సాను కూలంగా ఆలోచన చేసి ముందుకు సాగాల్సి ఉంది.  రాజకీయ దృక్కోణంలో కాకుండా అభివృద్ది కోణంలో ఆలోచన చేయాల్సిన విషయాన్ని పాలకులు వంటబట్టించు కోవాల్సి ఉంది. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్‌ వ్యవస్థ ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం బదులు నానాటికి దిగజారుస్తున్నాయి. ప్రజల డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చవుతోంది. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నారు. ఎన్నికలలో డబ్బు అవసరం లేకుండా సంస్కరణలు తీసుకురాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేదు. రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారమే కనుక,ఆ అధికారం కోసం ఎంతకైనా తెగబడతాయని నిరూపితం అయ్యింది.  పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు వారసత్వంగా వచ్చిన సకల అవలక్షణాలు ప్రజలను ఇంకా దరిద్రంలోనే ముంచెత్తుతున్నది. నిత్యాసవర సరుకుల ధరలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఉల్లి ధరలు ఆకాశన్నంటుతున్న వేళ ధరల నియంత్రణ జరగడం లేదు. కరోనా తరవాత అనేక రకాల వస్తువుల ధరలు పెరిగాయి. నూనెలు మండుతున్నాయి. మోడీ రాకతో ప్రజల్లో చిగురించిన ఆశలు వమ్మయ్యాయి. జిఎస్టీతో ప్రజలు మరింతగా కుంగిపోతున్నారు. జిఎస్టీని సమర్థించిన ఆయా రాష్ట్రాల సిఎంలే ఇప్పుడు దాని బారినుంచి రక్షించాలని కోరుకుంటున్నారు. వివిధ రంగాలపై అదిచూపిస్తున్న చెడు ప్రభావాన్ని విశ్లేషించు కోవాల్సిన మోడీ ప్రభుత్వం మొడిగా వ్యవహరిస్తోందే తప్ప ప్రజల కోణంలో ఆలోచించడం లేదు.  విద్యావైద్య రంగం ఎందుకు వెనకబడి ఉందో తెలుసుకోవాలి. అన్నిరంగాల్లో మనం ముందంజ వేయాల్సిన దశలో ఇంకా దిగుబడులపై ఆధారపడుతూ ఎగుమతుల విషయంలో లక్ష్యం లేకుండా సాగుతున్నాం.  ఆహారధాన్యాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.